చిత్రకారుడు భరత్ భూషణ్
- C B Rao
Inaguration of Exhibition Photo:cbrao
శుక్రవారం, 23 నవంబరు 2007 సాయంత్రం ఆరున్నర గంటలకు, మాసాబ్ టాంక్ లోని లక్ష్మన్ ఆర్ట్ గాలరి లో, ఒక విచిత్రం జరిగింది. ఇంతవరకు ఛాయా చిత్రకారుడిగా చిరపరిచితమైన భరత్ భూషణ్ గుడిమిల్ల, రంగుల కాన్వాస్ తో కూడిన చిత్రకారుడిగా పరిచయ మయ్యారు. ఈ మార్పు ఆశ్చర్యకరమైనా, ఆహ్వానించ తగినది. కొంతకాలం అనారోగ్యం, బయటకు కదలనీయక పోవటంతో, ఆ సమయాన్ని, సృజనాత్మకంగా, చిత్రలేఖనానికి ఉపయోగించారు భరత్ భూషణ్.
Bharath Bhushan at Painting Exhibition Photo: cbrao
ఓరుగల్లు లో పుట్టి పెరిగిన, భరత్ భూషణ్ కు బాల్యం నుంచీ, తెలంగాణా పండగలు, సంస్కృతి పై మక్కువ ఎక్కువ. బతుకమ్మ పండుగలో బొడ్డెమ్మ దేవత చుట్టూ గ్రామీణ యువతులు చేసే ఆట – పాట, రంగుల పూలు, పండుగకు భూషణ్ అమ్మమ్మ చేసే మిఠాయిలు, కొనిచ్చే బూరలు, ఇవన్నీ భూషణ్ మదిలో చెరగని ముద్ర వేశాయి. ఆ రంగుల పూల పై మమకారాం, భూషణ్ ను తరువాతి జీవితంలో ఒక మంచి ఛాయచిత్రకారుడిగా మలిచింది. బతుకమ్మ పండగ ఉత్సవాలపై వరుసగా నాలుగేళ్లు చిత్రాలు తీసి, పండగలో కాల క్రమేణా సహజ పూల స్థానంలో ప్లాస్టిక్ పూలు రావటాన్ని వేదనతో గమనించారు. బతుకమ్మ పండగ గురించి భూషణ్ మాటల్లో వినండి. (ఇంకా…)






